JSON Variables

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి శుక్రవారం రోడ్డుమార్గంలో బ‌య‌లుదేరారు. వారు మధ్యాహ్నం 12 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకున్నారు. యాదాద్రి గుట్ట చుట్టూ వాహనంలో గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం సీఎం ప్రెసిడెన్షియల్ సూట్‌ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి అభివృద్ధిపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. యాదాద్రి ఆలయానికి అనుబంధంగా జరిగే నిర్మాణాలు ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా అత్యంత వైభవంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం  ఫోన్లో ఆదేశించారు. మొత్తం వైటీడీఏకు 2157 ఎకరాల భూమిని రెవెన్యూశాఖ పూర్తిస్థాయిలో అప్పగిస్తుందని, దాని నిర్వహణను వైటీడీఏ అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఈ భూమిలో ఆలయ అవసరాలు, పోలీసుశాఖ, ఫైర్ స్టేషన్, హెల్త్, రవాణా, పార్కింగ్ వంటి యాదాద్రి అభివృద్ధికి సంబంధించిన అనుబంధ సేవల కోసం మాత్రమే వినియోగించాలని సీఎం సూచించారు. ఆలయ అర్చకులకు, సిబ్బందికి కూడా ఇందులోనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని అధికారులను సీఎం ఆదేశించారు.  యాదాద్రిలో ఉన్న విలేకరులకు వైటీడీఏ బయటప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని కలెక్టర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

యాదాద్రి టెంపుల్ టౌన్ తో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కాటేజీల నిర్మాణం, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా, పవిత్రమైన భావన వచ్చేలా ఉండాలని సీఎం అన్నారు. దాతలు కాటేజీల నిర్మాణం కోసం ఇచ్చే విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించిన 80జి అనుమతులు వెంటనే తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఒక ప్రణాళిక ప్రకారం యాదాద్రి పరిసరాలు అభివృద్ధి కావాలన్నారు. హెలీపాడ్ ల నిర్మాణం కూడా చేపట్టాలన్నారు. యాదాద్రి ఆలయ వైభవానికి అనుగుణంగా వైటీడీఏ సమీపంలో జరిగే ప్రైవేటు నిర్మాణాలకు, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతులివ్వాలన్నారు. వైటీడీఏ పరిధిలో ఉన్న100 ఎకరాల అడవిని ‘‘నృసింహ అభయారణ్యం’’ పేరిట అద్భుతంగా అభివృద్ధి చేయాలని, స్వామివారి నిత్య పూజలు, కల్యాణం, అర్చనలకు అవసరమైన పూలు, పత్రాలు ఆ అరణ్యంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలసి సీఎం ఆదేశించారు. 50 ఎకరాల్లో అమ్మవారి పేరుమీద ఒక అద్భుతమైన కల్యాణ మండపం నిర్మాణం చేపట్టాలన్నారు. ఆలయం సహా రింగు రోడ్డు మధ్యలో ఏ ప్రాంతంలోనూ ఒక్క చుక్క నీరు నిలబడకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తులకు క్యూలైన్లు  సహా ఇతర అన్నిచోట్ల ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దీక్షాపరుల మంటపం, వ్రత మంటపం, ఆర్టీసీ బస్టాండు, స్టామ్ వాటర్ డ్రయిన్ల నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

250 ఎకరాలలో నిర్మించే 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా, అద్భుతంగా నిర్మించాలని, వాటికి ప్రహ్లాద, యాద మహర్షి తదితర ఆలయ చరిత్రకు సంబంధించిన  పేర్లను పెట్టాలని సీఎం సూచించారు. ఆలయ ఆదాయం, ఖర్చుల ఆడిటింగ్ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ, ఆలయ నిర్వహణ కోసం నిధులు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. మినీ శిల్పారామం తరహాలో ఒక మీటింగ్ హాల్, స్టేజీ, స్క్రీన్ ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. 

అనంతరం ఆలయం వద్దకు చేరుకున్న సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ గారి కుటుంబం తరఫున వారి మనవడు హిమాన్షు యాదాద్రీశునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు సీఎం దంపతులను కుటుంబ స‌భ్యుల‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. 

కిలో బంగారం కోసం చెక్కును అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్..
స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తమ కుటుంబం తరఫున ప్రకటించిన 1 కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన రూ.52.48 లక్షల చెక్కును ముఖ్యమంత్రి దంపతులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వారి మనవడు కల్వకుంట్ల హిమాన్షురావు చేతుల మీదుగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, ఆలయ అధికారులకు అందజేశారు. 

అలాగే, యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 1 కిలో బంగారం కోసం రూ.50 లక్షల 15 వేల చెక్కును, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేంరెడ్డి నర్సింహరెడ్డి 1 కిలో బంగారం కోసం రూ. 51 లక్షల చెక్కును, ఏనుగు దయానంద రెడ్డి 1 కిలో బంగారం కోసం 50 లక్షల 4 వేల చెక్కును అధికారులకు అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ ప్రాంగణంలో కలియదిరుగుతూ నిర్మాణాలపై పలు సూచనలు చేశారు.

యాదాద్రి పర్యటనలో సీఎం దంపతులతోపాటు, మంత్రులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ జి. జగదీశ్ రెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ దీవకొండ దామోదర్ రావు, శ్రీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీమతి గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, శ్రీ చిరుమర్తి లింగయ్య, శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి, సీఎం సెక్రటరీ శ్రీ భూపాల్ రెడ్డి, కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీ అనిల్ కుమార్, యాదాద్రి ఈఓ శ్రీమతి గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ శ్రీ కిషన్ రావు, మాజీ ఎంపీ శ్రీ బూర నర్సయ్య గౌడ్, మాజీ మంత్రి శ్రీ మోత్కుపల్లి నర్సింహులు, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు శ్రీ గణపతిరెడ్డి, శ్రీ రవీందర్ రావు, ఆర్డీఓ శ్రీ భూపాల్ రెడ్డి, ఆర్కిటెక్ట్ శ్రీ ఆనంద్ సాయి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎండీ శ్రీ మనోహర్ రావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ కంచర్ల రామకృష్ణారెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ శ్రీ గంగుల కృష్ణారెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ శ్రీ రవీందర్ సింగ్ తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments